అది ఆదివారం. సంఘ ఆరాధనలో జాన్ కనిపించకపోయేసరికి డేవిడ్ ఆరాధన అవ్వగానే జాన్ ఇంటికి వెళ్లాడు. జాన్ చాలా కృంగిపోయి తన జీవితంలో ఎదురవుతున్న శ్రమలను గురించి డేవిడ్ తో పంచుకున్నాడు. జాన్ బాధను చూసిన డేవిడ్ ఏ మాత్రం తడబడకుండా “మనం క్రీస్తుశిష్యులం, దేవుడు లేనివారిలా అలా బాధపడతావేంటి?క్రైస్తవులు బాధపడొద్దు, పిరికివాళ్లలా ఏడవద్దు” అని సూటిగా చెప్పాడు.
ఇలా చెప్పడం సరైనదిగానే అనిపించినప్పటికీ క్రైస్తవులు కృంగిపోవడం, బాధల్లో ఏడవడం తప్పు అనే విధంగా డేవిడ్ మాటలున్నాయని మనకు అర్థమౌతుంది. సంఘాల్లో కూడా మనకు తెలియకుండానే ఇటువంటి బోధ కూడా జరగడం నేను గమనించాను. మనుషుల ఎమోషన్స్ మీద సరైన అవగాహన లేకపోవడం వలన బాధల్లో ఉన్నవారికి ఆత్మీయంగా చెడ్డ మాటలు చెప్పకపోయినా, ఆ భావోద్వేగాలు వ్యక్తపర్చడం కూడా తప్పే అనే తత్వం తరచుగా మనకు కనిపిస్తుంది. క్రైస్తవులకు, దేవుని వాక్యం మీద కాస్త జ్ఞానం లభించగానే ఇతర మనుషుల భావోద్వేగాల వాస్తవికతను మర్చిపోతారేమో అని నాకు అనిపిస్తుంటుంది.
దేవుడు భావోద్వేగాలు కలిగినవాడని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది.
ఉదాహరణకు, ఆదికాండం 6:6లో నరుల చెడుతనాన్ని చూసి దేవుడు సంతాపపడ్డాడు అని మోషే రాస్తాడు. అంటే దేవుడు మనుషుల పాపాన్ని చూసి బాధను వ్యక్తపర్చాడు అని అర్థం.
ఎఫెసీ 4:30లో "దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి" అని పౌలు రాస్తాడు. అంటే దేవుడు దుఃఖపడతాడు కావున మన జీవితాల ద్వారా దేవుణ్ణి దుఃఖపరచొద్దు అని అర్థం.
కీర్తన 147:11లో "తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు" అని కీర్తనాకారుడు రాస్తాడు. అంటే, దేవునియందు గౌరవం, భక్తిగల తన పిల్లలను చూసి దేవుడు సంతోషపడతాడు అని అర్థం.
ఈ వచనాలు దేవునికి ఎమోషన్స్ ఉన్నాయి అనే సత్యాన్ని మనకు బోధిస్తున్నాయి.ప్రభువైన యేసుక్రీస్తు కూడా లాజరు చనిపోయినపుడు బాధపడ్డాడు (యోహాను 11:35), ఆలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు కోప్పడ్డాడు (మత్త 21:12).
మనిషి భావోద్వేగాలు గలవాడిగా సృష్టించబడ్డాడు
దేవుడు మనిషిని తన సారూప్యంలో చేసినపుడు మనిషి హృదయంలో గల భావోద్వేగాలను(Emotions) కూడా చేశాడు. కోపం,బాధ,సంతోషం ఇవన్నీ దేవుడే మనిషిలో ఉంచాడు. వాటిని వ్యక్తపర్చడం తప్పు కాదు, పాపం అసలే కాదు. కీర్తనలు పుస్తకం చదివితే ఆ భావోద్వేగాలు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తాయి.
కీర్తన 13:1,2 - యెహోవా ఎన్నాళ్లవరకు నన్ను మర్చిపోవుదువు?ఎంతవరకు నా మనసులో చింతపడుదును? (బాధ)
కీర్తన 44:25 - మా ప్రాణము నేలకు కృంగియున్నది, మా శరీరము నేలను పట్టియున్నది. (బాధ)
కీర్తన 10:1 - యెహోవా నీవెందుకు దూరంగా ఉన్నావు? (కోపం)
కీర్తన 100:1,2 - సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి (సంతోషం)
కీర్తన 18:1 - యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను (ప్రేమ).
ఇంకా చాలా వచనాలు మనిషి యొక్క భావోద్వేగాలను మనకు పరిచయం చేస్తాయి. దేవుని పిల్లలే ఈ మాటలను రాశారు, దేవునికి తమ ఎమోషన్స్ వ్యక్తపరిచారు. మనకు బాధ కలిగినప్పుడు దేవుని ముందు మన బాధను చెప్పుకోవడం తప్పు కాదు. మనకు ఏడుపు వచ్చినపుడు ఏడ్వడం కూడా తప్పు కాదు. మన దేశంలో మగవారు ఏడవకూడదని, ఏడవడం బలహీనత అని చెబుతారు. చిన్న పిల్లలు (మగపిల్లలు) ఏడిస్తే కూడా ఆడవాళ్లలాగా ఏడ్వద్దు అని చెబుతుంటారు. ఇది సరైన అవగాహన కాదు.
కన్నీరు కార్చడం బలహీనత అయితే ప్రభువైన క్రీస్తు కూడా బలహీనుడౌతాడు (యోహాను 11:35). దేవుడు బలహీనుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడే తన భావోద్వేగాలను వ్యక్తపరిచినప్పుడు మనం కూడా వాటిని వ్యక్తపర్చడంలో తప్పు లేదు అని మనం ముందు నమ్మాలి. లేదంటే కన్నీటిని చాలా సార్లు ఇతరులు చూడకుండా అదిమిపెట్టుకోవడం అలవాటు అవుతుంది.
భావోద్వేగాల పట్ల జాగ్రత్త కలిగియుండాలి.
మనుషులు దేవుని స్వరూపంలో భావోద్వేగాలు గలవారిగా చేయబడ్డారు. అయితే, పాపం వలన భావోద్వేగాలు కూడా ప్రభావితం అయ్యాయి అనే సత్యం మరిచిపోకూడదు. పాపం వలన మనిషి తన భావోద్వేగాలను దేవునికి వేరుగా వ్యక్తపరుస్తున్నాడు.
కోపం దేవుడే ఇచ్చిన భావోద్వేగం అయినప్పటికీ ప్రతి విషయానికి కోప్పడడం, తీవ్రంగా కోప్పడడం, ఇతరులను గాయపర్చేలా కోప్పడడం దేవుడు మెచ్చడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అటువంటి కోపం దేవుని నీతి నెరవేర్చదు.
ఎఫెసీ 4:26 - కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. శ్రమల్లో బాధపడడం తప్పుకాదు కానీ అతిగా బాధపడుతూ అక్కడే ఉండడం మంచిది కాదు.
కీర్తన 13:1,2 వచనాల్లో “యెహోవా ఎన్నాళ్లవరకు నన్ను మర్చిపోవుదువు?ఎంతవరకు నా మనసులో చింతపడుదును?” అని ప్రశ్నించిన కీర్తనాకారుడే 13:5,6 వచనాల్లో “నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది.యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు. నేను ఆయనను కీర్తించెదను” అని చెబుతాడు.
జీవితంలో కొన్ని సార్లు చింతించడం షరా మామూలే అయినప్పటికీ ఫిలిప్పీ 4:6 లో “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” అని ఆజ్ఞాపించబడ్డాము. మన చింత మనల్ని దేవుని చెంతకు తీసుకెళ్లాలే తప్ప దేవుని నుండి దూరం కాకుండా మనమే చూసుకోవాలి.
జాన్ బాధను చూసిన డేవిడ్ ఇలా చెబితే బాగుండేది : జాన్, అవును, నీ బాధ వాస్తవమైనదే. అయితే, దేవుడు మంచివాడు, నీ బాధ ఆయన చూస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ప్రార్థనలో నీ బాధను ఆయనకు చెప్పు, ఆయన వింటాడు.నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తాను”.
- డా.శంకర్ బాబు
మనిషి భావోద్వేగాలను చాలా బాగా చెప్పారు అన్నగారు.
ReplyDelete