ఆదిమ మానవునికి కులం మతం అనే సంగతులు తెలియవు.
తెలిసిందల్లా ఆ రోజు కడుపు నింపుకోవడానికి వేటాడి తినడం.
నేటి ఆధునిక మానవుడు కూడా దాదాపు చేస్తున్నదిదే.
కడుపు నింపుకోవడానికి కష్టపడడం.
అప్పటి మనుషులు గుంపులు గుంపులుగా బ్రతికేవారట. అంటే అందరూ కలిసి జీవించేవారు. ఇద్దరు ముగ్గురుగా వేటకి వెళ్ళి, తెచ్చిన పదార్థాలను కలిసి కూర్చొని తినేవారట.
వీరిలో రంగు వృత్తి అనే తేడాలు ఉండేవి కావు.
మనిషి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వచ్చిన మార్పులలో ఆకలి మారలేదు, కష్టపడడం మారలేదు, చెమట చిందించడం మారలేదు కానీ, ఇతర మనుషులతో వ్యవహరించే విధానం మారింది.
ఇప్పుడు రంగు,కులం,మతం,చదువు, డబ్బు, నేపథ్యం ఇలా చాలా విషయాలను బట్టి ఇతర మనుషులతో వ్యవహరించే శైలి మారింది.
అభివృద్ధి చెందిన వారముగా చెప్పుకుంటున్న ఈ ఆధునిక మానవులు అంతరిక్షాన్ని సైతం అందుకుంటున్నారు కానీ, నేల మీద గల తోటి ప్రజలను కుల మత ప్రాంత సంపద అనే అడ్డుగోడలు కట్టి దూరం దూరంగా ఉంచుతున్నారు.
ఈ మధ్య G20 దేశాల సమావేశం ముంబైలో జరిగింది. ఎక్కడ చూసినా ఆ పోస్టర్లు కనిపించాయి. ఆ పోస్టర్ల మీద ఒక వాక్యం నన్ను ఆకట్టుకుంది. అదే "వసుదైవ కుటుంబకం". ఈ సంస్కృత పదానికి "ప్రపంచం ఒక కుటుంబం" అని అర్థం.
ప్రపంచం సంగతి పక్కన పెడితే మన దేశంలో ఈ వాక్యం అమలులో ఉందా ?
ఈ ప్రశ్నకు జవాబు, లేదు అని మనందరికీ తెలిసిందే.
కుటుంబంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. వివిధ రకాలైన ప్రజలు, వివిధ నేపథ్యాల నుండి వచ్చిన మనుషులు ఒక్కటే అనే తత్వం ఉంటుంది.
కానీ, గోడల మీద, పోసర్ల మీద, సభలలో చెప్పడానికి మాత్రమే ఇలాంటి వాక్యాలు పనికొస్తాయి. చెప్పే వాళ్ళు సైతం పాటించని వాక్యం ఇది.
ఏ ఒక్క దేశానికో చెందిన సమస్య కాదిది.
ప్రపంచంలో ప్రతిచోట గల ప్రజల్లో ఈ రకమైన విబేధాలు ఉన్నాయి.
ప్రపంచం ఒక కుటుంబం అవ్వాలంటే ప్రపంచంలో గల ప్రతి మనిషిని భగవంతుడు చేశాడు, ప్రతి వ్యక్తి మనలాంటి వాడే అనే సత్యాన్ని మనసుల్లో నింపుకోవాలి.
మన పక్కనే గల వ్యక్తులను వారి రంగు,కులం,మతం,డబ్బు,చదువు మొదలైన వాటిని బట్టి కాకుండా, వారు కూడా మనలాంటి మనుషులే అని వారితో సమానంగా వ్యవహరించాలి.
ఇది ముందు మనతోనే మొదలవ్వాలి.
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment