Skip to main content

క్రైస్తవులు వైద్యుల సలహాలు, ఔషదాలు వాడొచ్చా ?

క్రైస్తవులు వారి అనారోగ్యం నిమిత్తం వైద్యుల వద్దకు వెళ్లి, వారి వైద్యం తీసుకోవచ్చా ?
బైబిల్ గ్రంథం మందులు వాడకూడదని బోధిస్తున్నదా ?
ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి.
ఎందుకనగా క్రీస్తుని వెంబడిస్తున్న చాలా మంది “దేవుడు స్వస్థపరుస్తాడు కాబట్టి నేను వైద్యం
చేయించుకోను” అని వాదిస్తుంటే, అవిశ్వాసులు సైతం “మీ దేవుడు బాగు చేస్తాడు కదా, మరెందుకు
డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారని కూడా ప్రశ్నిస్తుంటారు.
కావున దేవుని వాక్యం వీటి విషయమై ఏమి బోధిస్తుందో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.
క్రైస్తవ జీవితానికి పునాదియైన వాక్యం నుండే ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే
ప్రయత్నం చేద్దాం.
మొదటిగా ఈ లోకంలో వ్యాధులు,మరణం అనేవి, పాపము వలన కలిగిన ఫలితాలని
లేఖనాలలో మనం చదువుతాం. మనిషి తాను చేసిన పాప ఫలితంగా శారీరక
మరియు ఆత్మీయ మరణానికి లోనైనాడని బైబిల్ మనకు బోధిస్తుంది.
అయితే, లేఖనాలలో ఎక్కడా కూడా క్రైస్తవులు వైద్యులవద్దకు వెళ్లకూడదని,
వైద్యాన్ని తీసుకోవద్దని రాయబడలేదు.
బైబిల్ చెప్పని విషయాలను, మన కల్పితాలతో
చెప్పడం సరియైనది కాదు.
కొన్ని వాక్యాలను తప్పుగా అర్థవివరణ చేసి, అన్వయించుకోవడం వలన కొంత మంది
క్రైస్తవులు తమ వ్యాదులకై, వైద్యం తీసుకోక మరణిస్తున్నారు.
ఆ వాక్యాలకు సరియైన అర్థ వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం.
2దినవృత్తా 16:12వ వచనంలో “ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ
సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములో
అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను” అని వ్రాయబడింది.
ఇక్కడ ఆసా వైద్యులను సంప్రదించడమనే కారణం ముఖ్యమైనది కాదు కానీ,
తాను యెహోవా వద్ద తన జబ్బు కొరకై విచారణ చేయకపోవడం ప్రాముఖ్యమైనదని 
గమనించాలి.
ఈ వాక్యంలో పరీశీలించాల్సిన విషయమేమిటంటే, పాతనిబంధన కాలంలో ప్రజలు 
వారి జబ్బు నిమిత్తమై వైద్యుని వద్దకు వెళ్ళేవారు. ఆసా, వైద్యుని ప్రథమంగా ఆశించి,
దేవుని నిర్లక్ష్యం చేసినాడని మాత్రమే ఈ వాక్యం సెలవిస్తోంది.
ఆది 50:2 వచనంలో, యోసేపు తన తండ్రియైన యాకోబు మరణించిన పిదప
తన తండ్రి శవమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచవలెనని తన దాసులైన 
వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక వైద్యులు ఇశ్రాయేలును సుగంధద్రవ్యములతో
సిద్ధపరిచిరి అని వ్రాయబడింది.
ఆ దినాలలో శవమును అప్పటికాలములో గల సుగంధద్రవ్యములతో వైద్యుల సలహాలతో
పాతిపెట్టేవారు.  
ఈనాడు కూడా కొన్ని రసాయనాల ద్వారా వైద్యపరంగా శవమును
కొన్ని రోజుల వరకు భద్రపరిచే సాంకేతికత మనకు తెలిసిందే.
యెషయా 38:21 : యెషయా “ అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని
ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను”.  
ఈ మాటలు హిజ్కియా తన మరణకరమైన రోగముతో బాధ పడుతున్న సమయంలో 
దేవుడు యెషయా ద్వారా వినిపించాడు. పుండుకు కావాల్సిన విరుగుడు లేదా
ఔషదమును యెషయా ఇక్కడ ప్రస్తావించినట్లు గమనించాలి.

నూతన నిబంధనలో గల లూకా సువార్త మరియు అపొస్తలుల కార్యముల గ్రంథకర్తయైన 
లూకా,వృత్తిరీత్యా వైద్యుడే.
లూకా 10:33-34 లో దొంగల చేతిలో చిక్కిన, కొరప్రాణముతో ఉన్నవాడి దగ్గరికి
ఒక సమరయుడు వచ్చి, అతని మీద జాలి పడి, నూనెయు ద్రాక్షా రసమును పోసి
అతని గాయములను కట్టి..అని వ్రాయబడింది.  నూనె, ద్రాక్షా రసములో ఔషధ గుణములు
లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువు వాటిని తన ఉపమానములో ఎందుకు ఉపయోగించాడు ?

అంతే కాక, “రోగులకే  గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదని లూకా 5:31లో
ప్రభువు తన శిష్యులకు బోధించాడు.  
మార్కు 5:25-30 వచనాలలో రక్తస్రావం చేత బాధపడుతున్న ఒక స్త్రీ, యేసు వద్దకు 
రావడానికి ముందు అనేక వైద్యుల వద్దకు వెళ్లినట్లు మనము చదువుతాం.
తన సమస్యకు పరిష్కారం ఆ వైద్యుల వద్ద దొరకనందున, ఆమె యేసు వద్దకు వచ్చింది.
అలాగని అసలు వైద్యులే లేరని వైద్యం తప్పని మనం చెప్పలేం. ఇప్పటికే కూడా చాలా వ్యాధులకు మందులు వాడినా ఫలితం లేకపోవడం మనకు తెలిసిందే. 
నూతన నిబంధన కాలంలో కూడా వైద్యులున్నారనియు, శరీర సంబంధ వ్యాధులకై 
చికిత్స నిమిత్తం ప్రజలు వారి యొద్దకు వెళ్లేవారని ఈ వాక్య భాగాలు స్పష్టముగా మనకు
బోధిస్తున్నాయి.
పై లేఖనాలను బట్టి ఒక విషయం అర్థమౌతుంది.
“ దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా, వైద్యులను వారి వైద్యమును, 
ఔషధాలను ఖండించడం లేదు”.  అయితే దేవుని యందు విశ్వాసం, స్వస్థపరచగలడనే 
నమ్మకం, ఆయనపై ఆధారపడి ప్రార్థన చేయడం ప్రాథమికంగా క్రైస్తవులు ఆచరించవలసి 
ఉన్నది. అదే విధంగా వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు మరియు చికిత్స
తీసుకోవడం కూడా మంచిదని విన్నవిస్తున్నాను.

కొందరు క్రైస్తవులు తాము చికిత్స తీసుకోవడం, వైద్యానికి మందులు వాడడం వలన,
ఇతరులతో పోల్చుకుంటూ, తమకు అల్ప విశ్వాసం ఉందని లేదా లోపము గల విశ్వాసం 
ఉందని కూడా బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం, దేవునివాక్యపు లోతైన అవగాహన లేకపోవడమే.

కొంతవరకు ప్రాస్పరిటీ బోధకుల బోధ కూడా ఇటువంటి వాక్య విరుద్ధ ఆలోచనలకు
బీజం పోస్తున్నాయి.
మీకు విశ్వాసం ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, లేదంటే నా దగ్గరికి రండి,
నేను మీకై ప్రార్థిస్తాను, దేవుడు స్వస్థపరుస్తాడు అని, విశ్వాసులలో దేవునిపై వారికి గల నమ్మకాన్ని తగ్గిస్తున్నారు.
దేవుడు స్వస్థపరచగలడనే మాట సత్యమే కానీ, దేవుడు కేవలం ఇదే విధంగా బాగుచేస్తాడని
మాత్రం చెప్పలేము.
ఆయన ద్వారా కలగజేయబడిన వైద్యము,మందులు, అలాగే జీవన విధానంలో కొన్ని మార్పుల
వలన కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. మందులు వాడుతున్నాం కావున అల్ప విశ్వాసులని,
వైద్య చికిత్స తీసుకొకపోతే అధిక విశ్వాసులని చెప్పడం సరియైనది కాదు.

దేవుడిచ్చిన జ్ఞానముతోనే వైద్య శాస్త్రం కొత్త పుంతలతో ముందుకు కొనసాగుతుంది.
దేవుని సహాయంతోనే  వైద్యులు తమ వంతు ప్రయత్నం చేస్తూ చికిత్స చేస్తున్నారు. చాలా వైద్యపరమైన మందులను కనుగొన్నది కూడా క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులే.

చివరికి ఒకనాడు అందరమూ మరణిస్తాం కానీ, మన అజ్ఞానం వలన వైద్యచికిత్స నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...