మార్కు 3:31-35లో, యేసుక్రీస్తు సహోదరులు, ఆయన తల్లియైన మరియ వచ్చారని వారు యేసును వెదకుచున్నారని యేసుతో చెబుతారు. అప్పుడు యేసు, తన చుట్టూ కూర్చున్న వారిని చూచి “ఇదిగో నా తల్లి, నా సహోదరులు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి” అని చెప్పాడు.
ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు తన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని మనకు అనిపించొచ్చు.
అంతేకాదు, ఎవరైనా తనను వెంబడించాలనుకుంటే తన తల్లినైనను, తండ్రినైనను, సహోదరులనైనను, సహోదరీమణులను, తన స్వంత ప్రాణమునైనను విడిచిపెట్టి, తన సిలువనెత్తుకుని వెంబడించకుంటే,వారు నా శిష్యులు కానేరరు (లూకా 14:26,27) అని చెప్పడం కూడా చూస్తాం.
ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు ప్రభువు, తనను ఎవరైనా వెంబడించాలంటే తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పినట్లుగా మనకు అనిపించొచ్చు.
కానీ, క్రీస్తు చెబుతున్న విషయం అది కాదు. క్రీస్తే స్వయాన తన తల్లిదండ్రులతో కలిసి ముప్పై సంవత్సరాలు వారికి లోబడి జీవించాడు (లూకా 2:51).
మార్కు 3:31-35లో, క్రీస్తు చెప్పదల్చుకున్న ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఎవరైతే దేవుని మాటలకు లోబడి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారే దేవుని పిల్లలు. దేవుని చిత్తానికి లోబడకుండా ఉన్న వారు భౌతికపరంగా కుటుంబసభ్యులే అయినప్పటికీ ఆత్మీయంగా కారు. క్రైస్తవ జీవితం అంతిమంగా ఆత్మీయసంబంధమైన జీవితమే కదా!
ఇక క్రీస్తు తన తల్లిదండ్రులను విడిచి నన్ను వెంబడించుమని చెప్పినప్పుడు, దేవుణ్ణి వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్థానంలో ఉంచకుండా, దేవుడే ప్రప్రథమ ప్రాధాన్యతగా కలిగి, దేవుణ్ణి అనుసరించమని చెబుతున్నాడు.
దేవుడు తప్ప ఇంకెవరూ దేవుని స్థానంలో ఉండకూడదు, అది తల్లిదండ్రులైనా లేదా అక్కాచెల్లెళ్లైనా లేదా అన్నాతమ్ముళ్లైనా!
క్రీస్తు, తన తల్లియైన మరియను ప్రేమించాడు, ఆమె పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు. సిలువ మీద నుండి “ఇదిగో నీ తల్లి” అని తన శిష్యునికి ఆ బాధ్యతను అప్పగించాడు (యోహాను 19:27).
క్రీస్తు, పరిశుద్ధాత్మ ద్వారా “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము (ఎఫెసీ 6:1,2) అని రాయించాడు.
ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం : దేవుడు మన సృష్టికర్త. ఆయనే మన తల్లిదండ్రుల లైంగిక కలయిక ద్వారా మనల్ని పుట్టించాడు,ఆయనే తల్లి గర్భంలో మనల్ని రూపొందించాడు,ఆయనే తల్లి గర్భం నుండి మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు,ఆయనే రక్షణ దయచేశాడు,ఆయనే నడిపిస్తున్నాడు,ఆయనే మనల్ని పరలోకానికి తీసుకెళ్లడానికి రాబోతున్నాడు. ఆయనకు మాత్రమే మన జీవితంలో మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి.
ఒకవేళ దేవునితో మన సంబంధాన్ని నాశనం చేసేది మన తల్లిదండ్రులైనా, కుటుంబ సభ్యులైనా వారిని దేవుని స్థానంలో ఉంచకుండా ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మీయ జీవితాల్లో నిర్ణయాలు తీసుకోవాలి, దేవుణ్ణి మహిమపర్చాలి.
- డా.శంకర్ బాబు.
Comments
Post a Comment