Skip to main content

వాక్యానుసారమైన శిష్యత్వం

మత్తయి 28:19,20

కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; 
తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు 
నామములోనికి 
వారికి బాప్తిస్మమిచ్చుచు 
నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని
గైకొనవలెనని వారికి బోధించుడి. 
ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

శిష్యులను ఎందుకు తయారు చేయాలి? 
ఎందుకంటే అది ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ.

ఎవరు శిష్యులను చేయాలి?
ఈ మాటలు,యేసు తాను పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళేముందు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. 
అప్పుడు ఆయన శిష్యులుగా ఉన్నవారికి, నేడు ఆయన శిష్యులుగా ఉన్నవారికి కూడా ఆ మాటలు వర్తిస్తాయి కాబట్టి, పాస్టర్లు, నాయకులు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు శిష్యులను చేయమని క్రీస్తు ఆజ్ఞాపించాడు అని ఈ వాక్యం బోధిస్తుంది.
ఎందుకంటే పై వాక్యం ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది కాబట్టి.

శిష్యులను చేయడం అనేది మన తోటి సోదరులు మరియు సోదరీమణులను క్రీస్తుతో సంబంధంలోకి ప్రవేశించడం ద్వారా క్రీస్తు పోలికలో ఎదగడానికి సహాయం చేయడం తప్ప మరొకటి కాదు. అదే వాక్యానుసారమైన శిష్యత్వం.

19,20 వచనాలను నిశితంగా గమనిస్తే, శిష్యులను చేయడం ఇక్కడ ప్రధాన క్రియ.
సువార్త కోసం వెళ్ళడం, బాప్తీస్మం ఇవ్వడం, మరియు బోధించడం అనేవి శిష్యులను తయారుచేసే ప్రక్రియలో చేయాల్సిన పనులు.

మనము వెళ్లి సువార్త ప్రకటించడం ద్వారా శిష్యులను చేసే పని మొదలుపెడతాము.
సువార్త ప్రకటించడం ప్రతి ఒక్కరి పని అని మనకు తెలుసు.కాబట్టి అందరూ శిష్యులను చేయాలి అని ఒప్పుకోవాల్సిందే.

బాప్తీస్మం అనేది సంఘానికి ఇవ్వబడిన సంఘ క్రమాలలో ఒకటి. ఇది స్థానిక సంఘంలోనే ఆచరించబడుతుంది.
విశ్వాసులకు బాప్తీస్మం ఇవ్వడం ద్వారా మనము శిష్యులను చేసే ప్రక్రియ కొనసాగిస్తాం.
బాప్తీస్మం తీసుకోవడం ద్వారా 
రక్షించబడి బాహ్యంగా సాక్ష్యం ఇవ్వడమే కాకుండా, ఒక వ్యక్తి క్రీస్తు శరీరమైన సంఘానికి అంటుకట్టుబడతాడని తెలుసుకోవాలి.
అందుకే, బైబిల్ సంబంధ సంస్థలు బాప్తీస్మం ఇవ్వవు, రక్షించబడిన వారిని స్థానిక సంఘానికి వెళ్లి అక్కడే బాప్తీస్మం తీసుకోమని చెబుతారు.

సంఘంలోని విశ్వాసులకు క్రమపద్ధతిలో దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా మనము శిష్యులను తర్ఫీదు చేస్తాము.
కొన్ని సంస్థలు కూడా శిష్యతపు తర్ఫీదు ఇస్తాయి కానీ, ఇతర విశ్వాసులతో కలిసి దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ఆ వాక్యాన్ని విశ్వాసులు గైకొని పాటిస్తున్నారో లేదో చూసి వారిని క్రీస్తు సారూప్యంలోకి మార్చే ప్రక్రియ కేవలం స్థానిక సంఘంలోనే సాధ్యమవుతుంది. 

క్రైస్తవ సంస్థలు బోధ చేయగలవు కానీ, క్రైస్తవులను జవాబుదారీతనంలో మరియు క్రమశిక్షణలో పెంచలేవు. 
అది సంఘం యొక్క ప్రేమ వాతావరణంలోనే జరిగి, విశ్వాసుల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

కొత్త నిబంధనలో ఇదే నమూనా మనం చూస్తాం.

అపొస్త 2: 41, కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. 
పెంతెకోస్తు పండగ రోజున 120 విశ్వాసులకు 3000 వేల మంది జోడించబడ్డారు. 
ఆ వెంటనే వారు చేసిందేమిటి? 

 2:42 వచనంలో వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. 
అంటే సంఘంగా కూడుకోవడం మొదలుపెట్టారు.

యేసు ప్రభువు చెప్పిన సువార్త ద్వారా శిష్యులు మారు మనస్సు పొందుకున్నారు, బాప్తీస్మం తీసుకున్నారు అదేవిధంగా వాక్యమును నేర్చుకోవడానికి తమను తాము అప్పచెప్పుకున్నారు.

మత్తయి 28:18,20 లోని యేసు మాటలను ఆయన శిష్యులు ఇలా ఆచరించారు.
అంటే, స్థానిక సంఘము ద్వారా మాత్రమే శిష్యులను తయారుచేయడం వాక్యానుసారమైన ప్రక్రియ అని అర్థమవుతుంది.

యేసు ప్రభువు ఆనాడు తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞకు ఈనాడు మనం కూడా విధేయత కలిగి క్రీస్తు శిష్యులను చేయుటకు దేవుడు మనకు సహాయం చేయును గాక.

- డా. శంకర్ బాబు 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...