Skip to main content

కరోనా ఉత్పాతం - క్రైస్తవ బాధ్యత

ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాధి గురించి
చర్చిస్తోంది.
ఆ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
వ్యాధి బారిన పడితే తీసుకోవాల్సిన
చికిత్సల గూర్చిప్రతి ప్రభుత్వం
వారి దేశ ప్రజలకు బోధించడం
మన ప్రతి రోజు వార్తల్లో చూస్తున్నాం.













ఒక వైపు భయపడాల్సిన అవసరం లేదంటూనే,
మరో పక్క వ్యాధి తీవ్రతను వైద్యాధికారులు
చెబుతూనే ఉన్నారు.
అన్ని దేశాల  ప్రజలు భయం భయంగానే రోజులు
గడుపుతున్న పరిస్థితి.

స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు,మాల్స్ మూసివేశారు.
సభలకు, సమావేశాలకు అనుమతి ఆపివేశారు.
రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు,
అక్కడక్కడ మరణాలు ప్రజలను భయభ్రాంతులకు
గురిచేస్తున్నవిషయం మనకు తెలిసిందే.

అయితే, సృష్టికర్తయైన సార్వభౌముడైన
త్రియేక దేవునియందు విశ్వాసముంచిన
క్రైస్తవ సమాజం ఈ పరిస్థితికి ఎలా
ప్రతిస్పందించాలి అనే ప్రశ్న నాకు కలిగింది.

నాకు తట్టిన కొన్ని విషయాలు మన
ఆత్మీయ ప్రోత్సాహం కొరకు
మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను.

మొదటిగా, ఈ లోకంలో ప్రతి వ్యాధికి మూలం
ఏదేను తోటలో ఆదాము, హవ్వల పాపంతో
ప్రారంభమైనదని తెలుసుకుందాం.
పాపము వలననే వ్యాధులు, రోగాలు,
శ్రమలు మానవాళికి సంభవించాయి,
ఇక ముందు కూడా సంభవిస్తాయి.

మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే
దేవుని ప్రణాళికను, దైవాజ్ఞను మీరిన మనిషి
పాపఫలితమైన వ్యాధిబాధలను పొందుకున్నాడు.

రెండవదిగా, కరోనా వైరస్ కన్నా ముందే
ఎన్నో వ్యాధులు ప్రపంచాన్ని
గడగడలాడించాయి.

ఇండియాలో మొదలైన కలరా వ్యాధి
యూరప్,ఉత్తర అమెరికా దేశాలకు వ్యాపించి
1852 నుండి 1860 వ సంవత్సరం వరకు
దాదాపు లక్ష మందిని బలితీసుకుంది.

1956-58 మధ్యలో ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల
ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది
చనిపోయారు.

1976 లో మొదలైన హెచ్ఐవి వైరస్ నేటికీ కూడా
చాలా మందిని వ్యాధిగ్రస్తులుగా చేస్తుంది.
2005-12 మధ్యలో దాదాపు 1.5 లక్షల మంది
హెచ్ఐవి/ఎయిడ్స్ వలన చనిపోయారు.

ఈ విషయాలను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే
ఇటువంటి వైరస్ మరియు బాక్టీరియాలు
ఇంతకుముందే ఎన్నో దేశాలపై దాడి చేసి
చాలా ప్రాణాలను బలితీసుకున్నాయి.
ఈ విధమైన సంఘటనలు కొత్తవి కాదనే
విషయం తెలుసుకోవాలి.

మూడవదిగా, మన జీవితాలు ఎంత చిన్నవో,
ఎంత సున్నితమైనవో ఇటువంటి ఉత్పాతాలు
మనకు గుర్తుచేస్తాయి.
నేను ఈ మాటలు రాస్తున్న సమయానికి
ప్రపంచ వ్యాప్తంగా 227,215 మందికి కరోనా సోకినట్లు,
9291 మంది మరణించినట్లు
సమాచారం.
ఒక చిన్న వైరస్ మానవాళిని గడగడలాడించడం చూస్తే,
మనిషి జీవితం ఎంత బలహీనమైనదో,
అల్పమైనదో తెలుస్తుంది.

బైబిల్ మనిషి జీవితాన్ని ఇంతలో కనబడి
అంతలో మాయమైపోయే ఆవిరితో,
వాడిపోయే గడ్డితో పోలుస్తుంది.
అందుకే కీర్తనాకారుడు " మా దినములు
లెక్కించుటకు మాకు నేర్పుము" అంటాడు.

నాలుగవదిగా, వాక్యం మనలను చింతించకుమని,
దేవుని యందు విశ్వాసం ఉంచుమని బోధిస్తుంది.

ఫిలిప్పీ 4:6 లో దేనిని గూర్చి చింతింపకుడి
అని ఆజ్ఞ ఇవ్వబడింది.
దేవుడు సార్వభౌముడని, ఆయన అనుమతి లేనిదే
ఈ లోకములో ఏమీ జరుగదని నమ్మవలసిన
వారమైయున్నాము.
దేవుడు కొన్ని సార్లు ఇటువంటివి ఎందుకు
అనుమతిస్తాడో పరిమిత జ్ఞానము గల
మనలకు తెలియకపోయినా,
ఆనంతుడైన ఆయన చిత్తములోనే
జరుగుతున్నాయనే విశ్వాసం
కలిగిఉండుట నేర్చుకోవాలి.

ప్రపంచం ఇటువంటి సంఘటనలను
బట్టి భయపడుతుంది
కానీ సంఘము దేవుని యందు విశ్వాసముతో
నిలబడుతుంది.
మరణ భయంతో ప్రజలు చింతించడం,
క్రుంగిపోవడం భవిష్యత్తు ఏమైపోతుందేమో
అని ఆలోచించడం మనం చూస్తుంటాం.
కానీ విశ్వాసికి మరణం దేవునితో గడిపే
ఆనందమైన సమయమే.

అవిశ్వాసులకు, విశ్వాసులకు తేడా
ఇక్కడే బయల్పడుతుందని కూడా
నేను నమ్ముతాను.

ఐదవదిగా, ఇటువంటి సమయాల్లో దేవునిపై
ఆధారపడడం, ప్రార్థనలో గడపడం కూడా
మనం నేర్చుకుంటాం.

ఎఫెసీ 6:18 లో ఆత్మ వలన ప్రతి సమయమందును
ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపన చేయుచు.. మెలకువగా ఉండుడీ
అని వాక్యం చెబుతుంది.
ప్రతి సమయములో అంటే ఇటువంటి
వ్యాధి బాధలలో సైతం అని మర్చిపోకూడదు.

ఆయన తప్ప ఈ వ్యాధులను, వాటి ద్వారా
ఉత్పన్నమయ్యే ఫలితాలను ఎవరు
నిరోధించగలరు ?
కొన్ని సార్లు శ్రమల ద్వారా కూడా
దేవుడు తన ప్రజలను
తన తట్టు తిప్పుకోడానికి వాడుకుంటాడు.


చివరిగా, ఇటువంటి స్థితిలో గల లోకానికి
పూర్తిగా వేరైపోక,ఇతరులకు సహాయం చేయడానికి
సిద్ధమనస్కులై యుండాలి.
క్రైస్తవ సంఘ చరిత్రలో ఇలాంటి వ్యాధులు
సంభవించినపుడు ధైర్యముతో ముందుకొచ్చి
క్రీస్తు ప్రేమతో రోగులకు సేవ చేసిన వాళ్ళు
మనకు కనబడతారు.

1854 లో లండన్ పట్టణంలో ఎంతో మంది
కలరా వ్యాధికి లోనైనారు.
కొన్ని మరణాలు కూడా సంభవించాయి.
ఆ సమయంలో పరిచర్య చేస్తున్న
చార్లెస్ స్పర్జన్ గారు ఆయనకున్న ఇతర ప్రదేశాల
ప్రసంగాలను రద్దు చేసుకొని లండన్ నగరంలో
రోగుల మధ్య సేవ చేశాడట.

భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు
అభయమిచ్చే క్రీస్తు సువార్త పంచడానికి కూడా
మంచి అవకాశంగా మనం ఉపయోగించుకోవచ్చు.

కరోనా వ్యాధి బారిన పడినవారి కొరకు
అలాగే దేవుడు ఈ వ్యాధిని
ఆపగలుగుటకు ప్రార్థన చేయడం
క్రైస్తవులుగా మన బాధ్యత.

అలాగని మన జాగ్రత్తలు మనం
నిర్లక్ష్యం చేసుకోవద్దని
కూడా చెప్పాలనుకుంటున్నాను.

ముఖ్యంగా, ఈ కరోనా వైరస్ బారిన పడకుండా
చేతులు శుభ్రంగా కడుక్కోవడం,
దగ్గినపుడు తుమ్మినపుడు
చేతిరుమాలు వాడడం,
మొఖాన్ని మాటి మాటికి తాకకుండా
జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది.

సమస్త విషయాలలో దేవునికే మహిమ కలుగును గాక.




Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...